ప్రస్తుతం తెలుగు పరిశ్రమలో నేషనల్ అవార్డుల విషయం చర్చనీయాంశంగా మారింది. ఉత్తమ నటుడిగా పుష్ప దిరైజ్ మూవీ హీరో అల్లు అర్జున్కు దక్కడం పలువురు హీరోలు, వారి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా ఆర్.ఆర్.ఆర్ సినిమాలో రామ్ చరణ్ లేదా ఎన్టీఆర్ నటనకు ఉత్తమ నటుడి అవార్డు వస్తుందని ఎదురుచూశారు. కానీ అనూహ్యంగా అల్లు అర్జున్కు దక్కడం అందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో నిజంగా బ్యాడ్ లక్ అంటే రామ్చరణ్దే అని మెగా అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
గతంలో మగధీర సమయంలో చెర్రీ నటనకు నంది అవార్డు వస్తుందని ఆశించగా.. మేస్త్రి సినిమాకు గానూ దాసరి నారాయణరావు ఉత్తమ హీరో అవార్డు దక్కించుకున్నారు. కొన్ని రాజకీయాల కారణంగానే రామ్చరణ్కు అవార్డు రాలేదని అప్పట్లో చర్చలు నడిచాయి. ఆ తర్వాత రంగస్థలం సినిమాలో చిట్టిబాబు క్యారెక్టర్లో జీవించేసిన రామ్చరణ్కు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు వస్తుందని మెగా అభిమానులు అంచనా వేశారు. కానీ ఉత్తమ హీరోయిన్గా మహానటి మూవీకి కీర్తి సురేష్కు అవార్డు దక్కడంతో ఉత్తమ నటుడి అవార్డును మాత్రం హిందీ సినిమాకు జ్యూరీ సభ్యులు కట్టబెట్టారు. అంధాధున్ మూవీలో గుడ్డివాడిగా అద్భుతంగా నటించినందుకు ఆయుష్మాన్ ఖురానాకు ఉత్తమ నటుడి అవార్డును ప్రకటించారు. ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ సినిమాకు చెర్రీకి జాతీయ ఉత్తమ అవార్డు వస్తుందని భారీ ఎత్తున ఊహాగానాలు నడిచాయి. కానీ పుష్ప సినిమాలో నటనకు అల్లు అర్జున్కు ఈ అవార్డు దక్కడంతో మరోసారి రామ్చరణ్కు నిరాశే మిగిలింది.