సంగీత దర్శకుడిగా దేవిశ్రీప్రసాద్ అందరికీ సుపరిచితమే అని చెప్పాలి. దేవి సినిమాతో టాలీవుడ్లో తన సంగీతాన్ని పరిచయం చేసిన అతడు ఆనందం, ఆర్య, శంకర్దాదా ఎంబీబీఎస్, సొంతం, మన్మథుడు లాంటి సినిమాలతో వరుసగా మ్యూజికల్ హిట్స్ అందించాడు. ఇటీవల పుష్ప సినిమాతో పాన్ వరల్డ్ రేంజ్లో పాపులర్ అయ్యాడు. ఇప్పుడు హీరోగా అరంగేట్రం చేయబోతున్నాడు. దేవి హీరో అవుతాడని కొన్నేళ్ల నుంచే టాలీవుడ్లో వార్తలు వస్తున్నాయి కానీ అవి కార్యరూపం దాల్చలేదు. కానీ ఇప్పుడు అనుకోకుండా ఒక ప్రాజెక్టులోకి హీరోగా వచ్చేశాడు. బలగం మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు వేణు యెల్దండి తన తదుపరి సినిమా కోసం కసరత్తులు ప్రారంభించాడు. దిల్ రాజు బ్యానర్లో తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం తొలుత హీరో నానిని అనుకున్నారు. ఆ తర్వాత నితిన్ వద్దకు ఈ ప్రాజెక్ట్ చేరింది. నితిన్ కూడా ఈ ప్రాజెక్టును తిరస్కరించడంతో బెల్లంకొండ శ్రీనివాస్ దగ్గరకు వెళ్లింది. కథ సిద్ధంగా ఉన్నా హీరో మాత్రం ఇప్పటివరకు ఫైనల్ కాలేదు. తరుచుగా హీరోలు మారడంతో ఈ సినిమా ఇంకా పట్టాలెక్కకపోవడం టాలీవుడ్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఎట్టకేలకు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ హీరోగా ఈ మూవీతో ఎంట్రీ ఇస్తున్నారన్న వార్త ఆసక్తికరంగా మారింది. త్వరలోనే ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చనుంది.
