Breaking News

‘బిగ్‌బాస్‌’లో పరిచయం లేని ముఖాలే ఎందుకు?

1 0

బిగ్‌బాస్ నిర్వాహకులు ఐదో సీజన్ కోసం ఏకంగా జంబో బ్యాచ్‌నే బరిలోకి దింపారు. ఈ ఏడాది 19 మందిని బిగ్‌బాస్ హౌస్‌లోకి పంపారు. అయితే వీరిలో ఎక్కువగా జనాలకు తెలియని ముఖాలే ఉన్నాయి. యాంకర్ రవి, ఇండియన్ ఐడల్ విన్నర్ శ్రీరామ చంద్ర, యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్‌లకు ఫాలోయింగ్ బాగానే ఉంది. మరోవైపు ఆర్జే కాజల్, అనీ మాస్టర్, కార్తీకదీపం ఉమాదేవి, సినీ నటి ప్రియ, సీరియల్ నటుడు సన్నీ లాంటి వారు తమ తమ వృత్తులలో చురుకుగా ఉన్నప్పటికీ ప్రజలలో అంత ఫాలోయింగ్ లేదు. ఇక ట్రాన్స్ జెండర్ ప్రియాంక సింగ్, మోడల్ జశ్వంత్ అలియాస్ జెస్సీ, కమెడియన్ లోబో, కండల వీరుడు విశ్వ, నటరాజ్ మాస్టర్, మానస్, హమీదా, శ్వేత, లహరి వంటి వారు దాదాపు 90% ప్రేక్షకులకు తెలియదు.

అయితే గత ఏడాది కూడా బిగ్‌బాస్ హౌస్‌లో దాదాపు 80 శాతం తెలియని ముఖాలనే నిర్వాహకులు ఉంచారు. అఖిల్, సొహైల్, అరియానా, మెహబూబ్, దివి, స్వాతి దీక్షిత్, యాంకర్ సుజాత లాంటి వారు ప్రేక్షకులకు తెలియకపోయినా కరోనా సమయంలో థియేటర్లు మూతపడటంతో బిగ్‌బాస్ అందించే వినోదాన్నే ప్రేక్షకులు ఆశ్రయించారు. అయితే ఈ ఏడాది కూడా ఇంచుమించు పరిస్థితి ఇలాగే ఉందని బిగ్‌బాస్ నిర్వాహకులు అభిప్రాయపడినట్లు ఉన్నారు. అందుకే తెలియని ముఖాలనే హౌస్‌లోకి పంపారు. అయితే బిగ్‌బాస్ నిర్వాహకులు మీలో ఎవరు కోటీశ్వరులు, మాస్టర్ చెఫ్ లాంటి షోలు తమకు పోటీ అవుతాయని ఊహించి ఉండరు. ఇప్పటికే జెమినీ టీవీలో ప్రసారమయ్యే ఆ రెండు షోలకు ఆదరణ బాగున్నట్లు రిపోర్టులు వస్తున్నాయి. మరోవైపు బిగ్‌బాస్ ఆరంభ ఎపిసోడ్‌లో చెప్పుకోతగ్గ మెరుపులేవీ కనిపించలేదు. మరి రానున్న రోజుల్లో బిగ్‌బాస్ టీఆర్పీ రేటింగులు ఎలా నమోదు చేస్తుందో వేచి చూడాలి.