స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదలైన పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ ఫస్ట్ గ్లింప్స్పై విమర్శల వర్షం కురుస్తోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా నటిస్తున్నారు. ఈ మేరకు ఈ చిత్రం మల్టీస్టారర్ మూవీగా ప్రచారం పొందింది. అయితే తాజాగా విడుదల చేసిన టీజర్లో పవన్ కళ్యాణ్ ఒక్కడినే చూపడంతో రానా అభిమానులు హర్ట్ అవుతున్నారు. మల్టీ స్టారర్ చిత్రం సోలో హీరో మూవీగా మారిందా? అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
కాగా ఈ టీజర్లో హీరో రానా వాయిస్ మాత్రం వినిపించారు. ‘డ్యాని.. డ్యానియల్ శేఖర్’ అని ఇందులో రానా అంటాడు. అయితే ఇందులో పవన్ కల్యాణ్ను చూపించి, రానాను మాత్రం చూపించకపోడం పట్ల నిర్మాత నాగ వంశీ రిప్లై ఇచ్చారు. దయచేసి వెయిట్ చేయాలని, దీనిపై ఎలాంటి ఊహాగానాలు వద్దని చెప్పారు. ప్రతీది క్రమ పద్ధతిలో ప్రేక్షకుల ముందుకు వస్తుందని తెలిపారు. కాగా ఈ సినిమాలో పవన్ సరసన నిత్యామీనన్, రానా సరసన ఐశ్వర్యా రాజేశ్ కథానాయికలుగా నటిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.