స్టార్ మాలో ప్రసారమయ్యే కార్తీక దీపం సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టీఆర్పీ రేటింగుల్లో టాప్లో కొనసాగుతున్న ఈ సీరియల్ ఇటీవల తీసికట్టుగా మారింది. కావాలని ఈ సీరియల్ను దర్శకుడు సాగదీస్తున్నాడనే కామెంట్లు వినిపిస్తున్నాయి. దీంతో గత రెండు వారాలుగా టీఆర్పీ రేటింగ్ కూడా పడిపోతూ వస్తోంది. మరోవైపు ఈ సీరియల్ చూసి జనం మాములుగా బూతులు తిట్టడం లేదు.
‘ఈ సీరియల్లో కనీసం లాజిక్ లేదు. కనీసం చిన్న పిల్లలకు తెలిసినవి కూడా డైరెక్టర్కు తెలియడం లేదు. సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలి అనుకుంటున్నారో అర్థం కావడం లేదు. ముగింపు ఇప్పటికైనా పలికితే బాగుంటుంది’ అంటూ సోషల్ మీడియాలో కొందరు కామెంట్లు పెడతున్నారంటే ఈ సీరియల్ ఎలా సాగుతుందో అర్ధం చేసుకోవచ్చు. మోనిత చనిపోయిందని తెలుసుకున్న పోలీసులు కనీసం మోనిత డెడ్బాడీ గురించి ఎంక్వైరీ చేయకపోవడం.. జైలులో ఉన్న ఖైదీ మోనిత బతికే ఉందని చెప్తున్నా.. పోలీస్ ఆఫీసర్ రోషిణి తిక్కతిక్కగా మాట్లాడటం చూస్తుంటే పోలీస్ వ్యవస్థనే ఈ సీరియల్ కించపరుస్తోంది అంటూ విమర్శలు వస్తున్నాయి. క్రమంగా జనం కూడా ఈ సీరియల్ను చూడటం మానేశారనే టాక్ వినిపిస్తోంది. హాట్స్టార్లో చూసేవారయితే ఈ సీరియల్ను 5 నిమిషాల్లో ఫాస్ట్ ఫార్వార్డ్లో చూసేస్తున్నారట. ఇలా కార్తీక దీపం ఆరిపోయే దీపంలా మారిపోతోంది. ఇప్పటికైనా దర్శకుడు ఈ సీరియల్కు ముగింపు పలికితే బాగుంటుందని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.
