Breaking News

ప్రపంచంలో మరో అరుదైన వ్యాధి

2 0

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే కరోనా వైరస్ కారణంగా అల్లాడుతున్న ప్రజలు మరో కొత్త వ్యాధి బారిన పడుతున్నారు. కెనడాలో కొత్తగా ఓ వ్యాధి వెలుగుచూసింది. ఓ 12 ఏళ్ల చిన్నారికి మాత్రం నాలుక పసుపు పచ్చగా అయిపోయింది. ఆ బాలుడి మూత్రం ఎర్రగా వస్తోంది. దీనికి కారణం ఎర్ర రక్తకణాలను మన రోగనిరోధక వ్యవస్థ చంపేసే అరుదైన ‘ఆటో ఇమ్యూన్ డిజార్డర్’ అని వైద్యులు తేల్చారు. బాలుడికి బొంగురు గొంతు, ఎర్రటి మూత్రం, కడుపు నొప్పి, చర్మం వాడిపోవడం వంటి సమస్యలు ఉండడంతో అతడిని తల్లిదండ్రులు సిక్ చిల్డ్రెన్ ఫర్ టొరంటో అనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. అతడిని పరీక్షించిన వైద్యులు.. తొలుత కామెర్లు అనుకున్నారు. ఎందుకంటే కామెర్లు వచ్చిన వారికి కళ్లు పచ్చగా మారతాయి కాబట్టి.

అయితే బాధిత బాలుడికి నాలుక పచ్చగా మారడం వైద్యులకు పలు అనుమానాలక తావిచ్చింది. దీంతో వారు బాలుడికి మరిన్ని పరీక్షలు చేయించి రక్తహీనత ఉందని నిర్ధారించారు. దాంతో పాటు పిల్లలకు సాధారణంగా వ్యాపించే ‘ఎప్ స్టైన్ బార్ వైరస్’ ఇన్ ఫెక్షన్ ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. మరోవైపు మంచి చేసే ఎర్ర రక్తకణాలను చంపేసే ‘కోల్డ్ అగ్లుటినిన్’ అనే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఉన్నట్టు తేల్చారు. శీతల వాతావరణం వల్ల ఈ జబ్బు వస్తుందని చెబుతున్న వైద్యులు.. ఈ బాలుడి విషయంలో మాత్రం ఎప్ స్టైన్ బార్ వైరస్ వల్లే వచ్చి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కోల్డ్ అగ్లుటినిన్ వల్ల రక్తహీనత వస్తుందని, ఎర్ర రక్తకణాలు దెబ్బ తింటాయని చెప్పారు. రక్త కణాలు చనిపోవడం వల్ల ఒంట్లో బైలిరూబిన్ పేరుకుపోతుందని, కామెర్లు వస్తాయని వైద్యులు తెలిపారు. బాలుడికి రక్తం ఎక్కించి చికిత్స చేశారు. రోగనిరోధక వ్యవస్థ అతి కార్యకలాపాలను తగ్గించేందుకు 7 వారాల పాటు స్టీరాయిడ్లు ఇచ్చారు. ఆ అబ్బాయి ప్రస్తుతం కోలుకున్నాడు. మెల్లమెల్లగా అతడి నాలుక మీద ఉన్న పసుపు రంగు కూడా పోయింది.