Breaking News

ప్రధాని మోదీని కలిసిన చిన్నజీయర్ స్వామి

0 0

దేశ రాజధాని ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆయన నివాసంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి, మైహోం గ్రూప్ ఛైర్మన్ డా.జూపల్లి రామేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్‌ వైస్ చైర్మన్ రామురావు కలిశారు. హైదరాబాద్ శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం 3వ వార్షికోత్సవం సందర్భంగా ఈ ఏడాది చివరలో నిర్వహించే ముగింపు వేడుకలకు విశిష్ఠ అతిథిగా రావాలని ప్రధానమంత్రిని ఆహ్వానించారు. ఇందుకు ప్రధానమంత్రి మోదీ సానుకూలంగా స్పందించారు.

సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రం ప్రాంగణంలో ఉన్న 108 దివ్య దేశాలలో కొలువుతీరిన దేవతామూర్తులకు జరిగే నిత్య కైంకర్యాలను ప్రధానికి తెలియజేశారు. 45 నిమిషాల పాటు సాగిన ఈ భేటీలో జీయర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తోన్న నేత్ర విద్యాలయం, ఆయుర్వేద- హోమియో కళాశాల పురోగతి గురించి ప్రధాని ఆసక్తిగా తెలుసుకున్నారు. ఆధ్యాత్మిక, దైవిక కార్యక్రమాల ద్వారా సమాజంలో భక్తిభావాన్ని పెంపొందిస్తూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారంటూ ప్రధాని మోదీ ఈ సందర్భంగా మైహోం గ్రూప్ చైర్మన్ డా. రామేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ రామురావును అభినందించారు.