Breaking News

టాలీవుడ్‌లో దసరా విజేత ఎవరు?

1 0

టాలీవుడ్‌లో మొత్తం మూడు సీజన్‌లను కీలకంగా భావిస్తారు. సంక్రాంతి, సమ్మర్, దసరా సీజన్‌లలో విడుదలయ్యే సినిమాలు రూ.కోట్లలో బిజినెస్ చేస్తుంటాయి. గత ఏడాది కరోనా కారణంగా దసరా సీజన్‌లో థియేటర్లు మూతపడి ఉన్నాయి. అయితే ఈ ఏడాది దసరా సీజన్‌కు రాజమౌళి మూవీ ఆర్.ఆర్.ఆర్ వస్తుందని భావించినా పాన్ ఇండియా సినిమా కాబట్టి మిగతా ప్రాంతాలలో థియేటర్లు అందుబాటులో లేకపోవడంతో వాయిదా పడింది. దీంతో టాలీవుడ్‌కు కళ తప్పింది. అయితే మూడు మీడియం రేంజ్ సినిమాలు బరిలో ఉండటంతో థియేటర్ల యాజమాన్యాలు గంపెడాశలు పెట్టుకున్నాయి.

శర్వానంద్, సిద్ధార్థ్ ‘మహా సముద్రం’, అఖిల్ ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’, రోషన్ ‘పెళ్లి సందడి’ సినిమాలు దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వీటిల్లో అఖిల్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ మాత్రమే ప్రేక్షకులను ఆకట్టుకుంది. లవ్, రొమాన్స్, కామెడీ, ఫ్యామిలీ అంశాలతో ఈ మూవీ తెరకెక్కింది. ప్రేమ, పెళ్లి తర్వాత భార్యాభర్తల జీవితం ఎలా ఉండబోతుంది అన్న పాయింట్ మీద బొమ్మరిల్లు భాస్కర్ ఈ మూవీని రూపొందించాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్ ఈ మూవీని నిర్మించింది. మరోవైపు అజయ్ భూపతి ‘మహాసముద్రం’ మూవీ కలెక్షన్లు మరీ తీసికట్టుగా ఉన్నాయి. ఈ మూవీ డిజాస్టర్‌గా నిలవబోతుందని ట్రేడ్ అంచనా వేస్తోంది. ఇక పెళ్లిసందడి మూవీ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఈ మూవీ లో బడ్జెట్‌లోనే తెరకెక్కింది. లాంగ్ వీకెండ్ రావడంతో ఈ మూవీ గట్టెక్కే అవకాశాలున్నాయి. ఈ మూడు సినిమాల్లో దసరా విజేత ముమ్మాటికీ అఖిల్ సినిమానే.