Breaking News

టీఆర్పీల్లో చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్

0 0

కౌన్ బనేగా కరోడ్‌పతికి రీమేక్ వెర్షన్‌గా తెలుగులో ప్రసారమవుతున్న షో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’. గతంలో నాలుగు సీజన్‌ల పాటు ఈ షో మాటీవీలో ప్రసారమైంది. తొలి మూడు సీజన్‌లను అక్కినేని నాగార్జున హోస్ట్ చేయగా.. తరువాతి సీజన్‌‌ను మెగాస్టార్ చిరంజీవి హోస్ట్ చేశాడు. ఇప్పుడు ఐదో సీజన్‌ అందుబాటులోకి వచ్చింది. అయితే ఈసారి షో పేరుతో పాటు హోస్ట్ మారాడు. ఐదో సీజన్ జెమినీ టీవీలో ప్రసారమవుతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు.

గతంలో బిగ్‌బాస్ షోను సక్సెస్‌ఫుల్‌గా నడిపిన ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు షో బాధ్యతలను భుజాల మీద వేసుకోవడంతో అందరిలోనూ ఆసక్తి పెరిగింది. దీంతో ఈసారి టీఆర్పీ రేటింగులపై జెమినీ టీవీ చాలా ఆశలు పెట్టుకుంది. అందుకే జెమినీ సరికొత్తగా అంటూ ప్రసారం చేసుకుంటోంది. అందరూ భావించినట్లుగానే ఎన్టీఆర్ షో చరిత్ర సృష్టించింది. ఆగస్టు 22, 23న ప్రసారమైన కర్టన్ రైజర్ ఎపిసోడ్‌కు సంబంధించిన టీఆర్పీ రేటింగ్ తాజాగా వెలువడింది. దీనికి రికార్డు స్థాయిలో 11.40 టీఆర్పీ రేటింగ్ దక్కింది. ఇది ఈ షో చరిత్రలోనే అత్యధిక రేటింగ్ కావడం విశేషం. గతంలో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షో నాలుగు సీజన్లకు సంబంధించిన ప్రారంభ ఎపిసోడ్ రేటింగ్‌ను పరిశీలిస్తే.. అక్కినేని నాగార్జున హోస్ట్ చేసిన మొదటి సీజన్‌కు 9.70, రెండో సీజన్‌లో 8.20, మూడో సీజన్‌లో 6.72, మెగాస్టార్ చిరంజీవి నడిపించిన నాలుగో సీజన్‌లో 3.62 రేటింగ్ మాత్రమే దక్కింది. దీంతో తారక్ పేరిట ఇప్పుడు సరికొత్త రికార్డు నమోదైంది.