Breaking News

షర్మిల వెనుక ఉంది ఎవరు?

0 0

తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీ పెడతారని వస్తున్న ఊహాగానాల నేపథ్యంలో కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. తమకు తెలంగాణతో సంబంధంలేదని స్పష్టం చేసిన జగన్.. ఇప్పుడు ఆయన చెల్లెలు షర్మిల ఏకంగా కొత్త పార్టీ పెట్టనున్నట్లు తేలిపోవడంతో అసలు ఆమె వెనుక ఉన్నదెవరు అన్న అంశంపై జగ్గారెడ్డి మాట్లాడారు. తెలంగాణలో ఆంధ్రా సెటిలర్స్ ఉన్న ప్రాంతాల్లోనే షర్మిల మీటింగ్‌లు పెడుతుందని, షర్మిల పార్టీ వెనుక బీజేపీ ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఉత్తరాదిలో బీజేపీ తన ప్రభావం కోల్పోతుందని, అందుకే దక్షిణాది రాష్ట్రాలపై ఫోకస్ చేసిందని విమర్శించారు.

తెలంగాణలో రెడ్డిలను కాంగ్రెస్ నుంచి వేరుచేయడానికే బీజేపీ షర్మిలతో పార్టీ పెట్టిస్తోందని ఎద్దేవా చేశారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఎవరూ దెబ్బతీయలేరని అన్నారు. చంద్రబాబును తెలంగాణ నుంచి వెళ్లగొట్టేందుకు కుట్రలు చేసిన కేసీఆర్.. షర్మిల పార్టీపై నోరు విప్పకపోవడం ఏంటని జగ్గారెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్, జగన్, అసదుద్దీన్, షర్మిల.. ఇలా అందరూ అమిత్ షా వదిలిన బాణాలే అని జగ్గారెడ్డి ఆరోపించారు. రేపు తెలంగాణలో జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పెట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు.