Breaking News

ఈ లెజెండ్స్‌తో మహేష్, ఎన్టీఆర్, పవన్ పనిచేయరా?

1 0

పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్ హీరోలుగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి వచ్చి దాదాపు 21 ఏళ్లు అవుతోంది. ఈ ముగ్గురు హీరోలు 25కు పైగా సినిమాలు చేశారు. చాలామంది సంగీత దర్శకులతో పనిచేశారు. కానీ ఈ ముగ్గురు హీరోలు ఓ ఇద్దరు లెజెండ్లతో ఇప్పటివరకు పనిచేయలేదు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు తమ కెరీర్‌లో ఎం.ఎం.కీరవాణితో పనిచేయకపోవడం ముమ్మాటికీ లోటే. కోటి, రమణగోగుల, మణిశర్మలతో పవన్ ఎక్కువ సినిమాలు చేసినా ఇప్పటివరకు కీరవాణితో పనిచేయలేదు. మహేష్ కూడా ఎక్కువ సినిమాలు మణిశర్మ, దేవిశ్రీప్రసాద్‌లతో చేసినా ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్న కీరవాణితో ఒక్క సినిమా కూడా చేయలేదు. అటు ఎన్టీఆర్ కూడా ఇప్పటివరకు ఏఆర్ రెహ్మాన్‌తో పనిచేయలేదు. మహేష్ మాత్రం రెహ్మాన్‌తో ‘నాని’ చేయగా పవన్ ‘కొమురం పులి’ చేశాడు. అయితే రాజమౌళితో సినిమాలు చేశాడు కాబట్టి కీరవాణితో ఎన్టీఆర్ స్టూడెంట్ నెం.1, సింహాద్రి, యమదొంగ వంటి‌ మూడు సినిమాలకు పనిచేశాడు. ఇప్పుడు ‘RRR’కి కూడా కీరవాణినే సంగీతం అందిస్తున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో నటిస్తేనే పవన్, మహేష్‌ సినిమాలకు కూడా కీరవాణి సంగీతం సమకూర్చే అవకాశం ఉంటుందేమో. ఎందుకంటే ఇటీవల కాలంలో ఆయన ఎక్కువగా రాజమౌళి సినిమాలకే పనిచేస్తున్నాడు కదా. కాగా క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న మూవీకి కీరవాణి సంగీతం సమకూరుస్తాడని సమాచారం. దీంతో కీరవాణితో పవన్ చేయబోయే తొలి సినిమా ఇదే కానుంది.