Breaking News

కోహ్లీ, తమన్నాలకు హైకోర్టు నోటీసులు

0 0

ఆన్‌లైన్ రమ్మీ ఆటకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, నటి తమన్నాలకు కేరళ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ వెబ్‌సైట్లకు సెలబ్రిటీలు ప్రచారం చేయడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్‌పై కేరళ హైకోర్టు విచారణ చేపట్టింది. దీనిపై సమాధానం చెప్పాలని కోహ్లీ, తమన్నాకు జారీ చేసిన నోటీసుల్లో పేర్కొంది. అటు ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని కేరళ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాగా ఈ వివాదంలో పలువురు నటులుతోపాటు, క్రికెట్‌ సెలబ్రిటీలపై ఇప్పటికే మద్రాస్ హైకోర్టు సీరియస్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా వీటిపై కేరళ హైకోర్టు కూడా సీరియస్‌గా స్పందించింది. ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్స్‌‌కు అనుకూల ప్రకటనల్లో నటించిన విరాట్ కోహ్లీ, సౌరభ్ గంగూలీ, హీరోయిన్‌ తమన్నా, నటులు దగ్గుబాటి రానా, ప్రకాష్ రాజ్, సుదీప్‌కు గత ఏడాది మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్స్ వల్ల ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారనంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు వాటిని ఎందుకు ప్రోత్సహిస్తారని నటులు, క్రికెటర్లను హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. ఇలాంటి సైట్లపై ఎందుకు కఠిన చర్యలు తీసుకోవడం లేదని తమిళనాడు ప్రభుత‍్వంపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది.