Breaking News

భర్త వీర్యంపై భార్యకే పూర్తి హక్కులు

0 0

కోల్‌కతా హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. చనిపోయిన వ్యక్తి వీర్యం కోసం 2020 మార్చిలో దాఖలైన ఓ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు.. చనిపోయిన భర్త వీర్యంపై భార్యకే పూర్తి హక్కులు ఉంటాయని తీర్పు ప్రకటించింది. ఢిల్లీలోని స్పెర్మ్ బ్యాంకులో దాచిన తన కుమారుడి వీర్యాన్ని కోడలు తమకు దక్కకుండా చేస్తోందంటూ ఓ తండ్రి కోర్టును ఆశ్రయించాడు. ఆ వీర్యం నాశనమైనా, ధ్వంసమైనా తమ వంశం నశిస్తుందని పిటిషన్‌లో పేర్కొన్నాడు. అసలు కథలోకి వెళ్తే.. కోల్‌కతాకు చెందిన పిటిషనర్‌ కుమారుడు తలసేమియాతో బాధపడేవాడు. ఢిల్లీ హాస్పిటల్‌లో ఇందుకు చికిత్స కూడా తీసుకునేవాడు. 2015లో ఢిల్లీకి చెందిన ఓ మహిళను పెళ్లి చేసుకున్నాడు. 2018లో అతడు మరణించాడు. అయితే మరణానికి ముందే ఢిల్లీలోని స్పెర్మ్ బ్యాంకులో అతడి వీర్యాన్ని దాచారు. ఈ నేపథ్యంలో స్పెర్మ్‌ బ్యాంకులోని తమ కుమారుడి వీర్యాన్ని రెండేళ్ల ఒప్పందకాలం ముగిసేవరకు భద్రంగా ఉంచాలని తల్లిదండ్రులు బ్యాంకుకు లేఖ రాశారు. ఈ లేఖపై స్పందించిన స్పెర్మ్‌ బ్యాంక్‌.. వీర్యాన్ని అతడి భార్య గర్బం దాల్చడానికి ఉపయోగించాలన్నా.. లేక, వేరే వాళ్ల కోసం వాడాలన్నా.. పాడేయాలన్నా అది కేవలం భార్య అనుమతితోనే సాధ్యమవుతుందని తెలిపింది. దీంతో వారు తమ కోడల్ని వీర్యం విషయమై నో‌ అబ్జెక్షన్‌ లెటర్‌ ఇవ్వాలని కోరారు. ఇందుకు ఆమె తిరస్కరించడంతో వారు కోర్టును ఆశ్రయించారు.